Monday, August 10, 2009

కరివేపాకు , Curry Leaves

  • కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. సువాసన గల చిన్న వృక్షం. (Curry leaves or Sweet Neem Leaves). దీని శాస్త్రీయ నామము "Murraya Koenigii".. తెలుగు లో కరివేపాకు అంటాము . 4 నుండి 6 మీటర్ల ఎత్తు ఉండే ఈ చెట్టు ఆకులు సువాసన కలిగి ఉంటాయి . వీటి గింజలు (సీడ్స్) విష పదార్ధము కలిగి ఉంటుంది . ఎక్కువగా ఇండియా , శ్రీలంక లలో కనిపిస్తుంది . కూర , చారు , పులుసు వంటకాలలో సువాసనకోసం వాడుతారు
అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క "కరివేపాకు" ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు. కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు. వైద్య పరం గా ఇది ...
  • మధుమేహ తగ్గించే గుణము (anti Diabetic),
  • విష పదార్దాల విసర్జనకారిణిగా (anti oxidant),
  • సూక్ష్మ క్రిమి నివారిణిగా (anti microbial),
  • శరీరమునకు రక్షన ఇస్తుంది (anti inflamatary ),
  • కాలేయాన్ని విసతుల్యమవకుండా కాపాడుతుంది(hepatoprotective ),
  • కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది(anti cholesterolemic) ,
ఆయుర్వేదము లో : మూలము : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
  • కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు ఒక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు- జాత్యాది తైలం, జాత్యాది ఘృతం. కరివేపాకుతో తయారుచేసుకున్న చూర్ణాన్ని 3-6గ్రాముల మోతాదులో వాడాలి. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.  
అధిక కొలెస్టరాల్: కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది.  
  • గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు: కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.  
స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం: కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.  
  • అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు: కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.  
కాలిన గాయాలు: చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగానూరి నెయ్యిని గాని లేదా వెన్ననుగాని కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. ఇలా చేయటంవల్ల గాయాలు త్వరితగతిన మచ్చలు పడకుండా మానుతాయి.  
  • దురదలు: ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. 
 అజీర్ణం మూలంగా విరేచనాలు: కరివేపాకును ముద్దగా నూరి టీ స్పూన్ మోతాదులో సమానంగా తేనెను కలిపి రెండుపూటలా తీసుకుంటే జీర్ణక్రియ గాడిలో పడి విరేచనాలు తగ్గుతాయి.  
  • జ్వరం: కరివేపాకు ఆకులతో కషాయం కాచి తీసుకుంటే జ్వరంలో హితకరంగా ఉంటుంది.  
అజీర్ణం, అరుగుదల తగ్గటం: ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, సైంధవ లవణం పొడిని కలిపి సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. కలరా వ్యాధిలో కూడా ఇది ఉపయుక్తమే.  
  • నీళ్ల విరేచనాలు: కరివేపాకులను ముద్దగా నూరి 1-2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే అతిసారంలో హితకరంగా ఉంటుంది. 
 అమీబియాసిస్: కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాల్లో ఉపశమనం లభిస్తుంది.  
  • కడుపుబ్బరింపు, కడుపులో మంట: కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరింపు, మంట వంటివి తగ్గుతాయి. 
 క్రిమికీటకాల కాటు, దద్దుర్లు: కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి కీటకాలు కుట్టినచోట ప్రయోగిస్తే నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి లక్షణాలు తగ్గుతాయి. దద్దుర్లు కూడా తగ్గుతాయి.  
  • శ్వాసకోశ వ్యాధులు: కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.  
మూత్ర పిండాల సమస్యలు: కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది.
  •  క్యాటరాక్ట్: తాజా కరివేపాకు రసాన్ని కళ్లలో చుక్కల మందులాగా వాడితే క్యాటరాక్ట్ వేగాన్ని ఆలస్యం చేయవచ్చు.  
ఆర్శమొలలు: లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్శమొలల్లో ఉపశమనం లభిస్తుంది. లేదా కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోయి ఫైల్స్ బాధ తగ్గుతుంది.  
  • సౌందర్య సమస్యలు చర్మసంబంధ సమస్యలు: కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల్లో హితకరంగా ఉంటుంది. 
  • కంటి కింద వలయాలు: కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి.  
  • పాదాల పగుళ్లు: కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి పాదాల పగుళ్లమీద వారం పది రోజులపాటు రాత్రిపూట రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. చుండ్రు: కరివేపాకు, నిమ్మ పండ్లపై నుండే తోలు, శీకాయ, మెంతులు, పెసలు... వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరి, నిల్వచేసుకొని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.  
  • కురుల ఆరోగ్యానికి తల నూనె: కరివేపాకును ముద్దగా నూరి, ఒకటిన్నర రెట్లు కొబ్బరి నూనె కలిపి, చిన్న మంట మీద మరిగించి, వడపోసుకొని నిల్వచేసుకోవాలి. దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది.  
  • చెమటవల్ల వచ్చే దుర్గంధం: కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమటవల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది. 
 కరివేపాకు తో జుట్టు నిగనిగ
  • కరివేపాకుని కూరల్లో వేస్తే రుచి పెరుగుతుంది. దానిని జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తే అందం కూడా పెరుగుతుంది.
కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి. దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు. అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే, జట్టు రాలిపోవడం సమస్య తగ్గుతుంది. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి వారు కూరల్లో వేసిన కరివేపాకుని తినడమే కాదు... దాని మిశ్రమాన్ని తలకి పట్టించుకుని, కాసేపయ్యాక శుభ్రపరుచుకున్నా మంచిదే. కొన్ని వారాల్లోనే జుట్టు నల్లగా మారడం గమనిస్తారు.

జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని మాడుకీ, వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి. పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్‌ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
  • -------------------------------------------------
 visit my website : dr.seshagirirao.com

4 comments:

  1. ఆయుర్వేద వివరణ బాగుంది.వనమూలికల గురించి కూడా తెలిపితే బాగుంటుంది.నాకు తెలిసినన మూలికల గురించీ తెలపాలను కుంటున్నానను.మూలశంక గురించిన వైద్యం తెలుసు ౫రోజులలో తగ్గుతుంది

    ReplyDelete
  2. ఆయుర్వేద వివరణ బాగుంది.వనమూలికల గురించి కూడా తెలిపితే బాగుంటుంది.నాకు తెలిసినన మూలికల గురించీ తెలపాలను కుంటున్నానను.మూలశంక గురించిన వైద్యం తెలుసు ౫రోజులలో తగ్గుతుంది

    ReplyDelete
  3. మూలశంక..గుదము వద్ద వాపు రక్తము పడుట మలబద్దకము నొప్పి ఉన్నట్లయితే గడ్డిచామంతి ఆకు గుప్పెడు 5మిరియాలు చెంచాడు పటికబెల్లం పొడి కలిపి మిక్సి లోవేసి అందులో గ్లాసు నీరు కలిపి ఉదయం పరగడుపున 5 రోజులు త్రాగాలి .ఒక గంట వరకు ఏమీ తినరాదు త్రాగరాదు.కొందరికి మలద్వారం వద్ద. పిలకలు ఉండి బాదిస్తాయి వారు గోరింటాకు మెత్తగా నూరి గుదము రంద్రము (భగద్వారం)లో ముద్ద పెట్టి రాత్రి పండుకునే ముందు ...మెడికల్ టేప్ అంటించాలి. అలా 3రోజులు చేస్తే తగ్గి పోతుంది

    ReplyDelete
  4. మూలశంక..గుదము వద్ద వాపు రక్తము పడుట మలబద్దకము నొప్పి ఉన్నట్లయితే గడ్డిచామంతి ఆకు గుప్పెడు 5మిరియాలు చెంచాడు పటికబెల్లం పొడి కలిపి మిక్సి లోవేసి అందులో గ్లాసు నీరు కలిపి ఉదయం పరగడుపున 5 రోజులు త్రాగాలి .ఒక గంట వరకు ఏమీ తినరాదు త్రాగరాదు.కొందరికి మలద్వారం వద్ద. పిలకలు ఉండి బాదిస్తాయి వారు గోరింటాకు మెత్తగా నూరి గుదము రంద్రము (భగద్వారం)లో ముద్ద పెట్టి రాత్రి పండుకునే ముందు ...మెడికల్ టేప్ అంటించాలి. అలా 3రోజులు చేస్తే తగ్గి పోతుంది

    ReplyDelete