Saturday, March 26, 2011

త్రిఫల చూర్ణం , Trifala chuurnam (Three nuts powder)

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు. ఉసిరి ఉసిరిలో సి విటమిన్‌ అత్యధికంగా వుంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియంలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్దకం తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది. బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిన్‌ ఉసిరిలో వుంది. తానికాయ తానికాయ వగరు, ఘాటురుచి కలిగి వుంటుంది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది. కరక్కాయ త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్నిస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది. వాడే విధానం త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది. త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలిపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి. మలబద్ధకం బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది. ఒక చెంచా త్రిఫ లచూర్ణం రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మరక్షణకు త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మ కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా వుండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్శివలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.అంతేకాదు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.
  • ==============================================
Visit my Website - Dr.Seshagirirao

1 comment:

  1. మంచి సమాచారం దన్యవాదాలు డాక్టర్ గారు

    ReplyDelete